‘బాలిక చదువు.. దేశానికి వెలుగు’
ABN , First Publish Date - 2021-01-25T05:32:29+05:30 IST
బాలికల చదువు దేశానికి వెలుగని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి అన్నారు. ఆదివారం రుద్రవరంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీ నిర్వహించారు.
రుద్రవరం, జనవరి 24: బాలికల చదువు దేశానికి వెలుగని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి అన్నారు. ఆదివారం రుద్రవరంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి అమ్మవారిశాల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆడ పిల్లను చదివిద్దాం, ఆడ పిల్ల అభివృద్ధికి పాటుపడదాం అనే నినాదాలు చేశారు. సూపర్వైజర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడ పిల్లను తప్పనిసరిగా చదివించాలని సూచించారు.
బనగానపల్లె: పట్టణంలోని గ్రంథాలయంలో బాలికా దినోత్సవ వేడుకలు ఆదివారం గ్రంఽథాలయాధికారి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన రోజును రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభాపాటిల్ ప్రతి సంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవంగా జరుపుకోవాలని కోరారన్నారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన బాలికా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్ధులకు నీతికథలు వివరించారు. అనంతరం వివిధ క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు హెచ్ఎం సుధాకర్రెడ్డి, తెలుగు ఉపాధ్యాయుడు హరినాథ్గౌడ్, గ్రంధాలయ సిబ్బంది రామదాసు, పుస్తక నిక్షిప్త కేంద్రనిర్వాహకుడు మదనమోహన్రెడ్డి పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల మండలంలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలికా దినోత్సవాన్ని అంగన్వాడీ టీచర్లు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొలిమిగుండ్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలనీలో ఉన్న మూడో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు త్రివేణి, అనిత బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.