వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-14T06:22:59+05:30 IST
ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి మంగళవారం మృతిచెందారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 13: ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి మంగళవారం మృతిచెందారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మకూరుతో పాటు పరిసర గ్రామాల్లో గత కొన్ని రోజులుగా సంచరించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన వెంకటాపురం గ్రామంలోని ఎస్సీకాలనీలో ఉన్న ఓ వాటర్ ట్యాంకును ఎక్కి దుస్తులు లేకుండా నగ్నంగా కేకలు వేస్తూ.. హల్చల్ సృష్టించాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని బంధించి కిందికి దించి పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. అయితే ఆ మరుసటి రోజు నుంచి మతిస్థిమితం లేని వ్యక్తి పట్టణంలో సంచరిస్తూ.. ఎవరన్నా ఆహారం ఇచ్చినా తినేవాడు కాదు. ఈ క్రమంలో డీహైడ్రేషన్కు గురై పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో ఉన్న మురుగు గుంతలో పడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతికి గల కారణాలను ఆరా తీశారు. మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.