మల్లన్న హుండీ రాబడి రూ.3,82,23,900

ABN , First Publish Date - 2021-01-20T05:33:44+05:30 IST

శ్రీశైలంలో మంగళవారం హుండీ రాబడిని లెక్కించారు.

మల్లన్న హుండీ రాబడి రూ.3,82,23,900

శ్రీశైలం, జనవరి 19: శ్రీశైలంలో మంగళవారం హుండీ రాబడిని లెక్కించారు. స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల్లో రూ.3,82,23,900 నగదు వచ్చింది. ఈ ఆదాయాన్ని భక్తులు 35 రోజుల్లో సమర్పించారు. 153.900 గ్రాముల బంగారం, 4.700 కిలోల వెండి కూడా లభించాయి. విదేశీ కరెన్సీ కూడా భక్తులు సమర్పించారు. 





25 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు 

కర్నూలు(అర్బన్‌), జనవరి 19: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 5, 6 సెమిస్టర్‌ ఇన్‌స్టంట్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కర్నూలు డివిజన్‌ పరిధిలో కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నంద్యాల డివిజన్‌ పరిఽధిలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఆదోని డివిజన్‌ పరిధిలో ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాళ్ల వద్ద 21వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ 3, 4, 6, 8 సెమిస్టరు పరీక్షలను కూడా 25వ తేదీ నుంచి నిర్వహిస్తామని పరీక్షల అధికారి తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ హాల్‌ టికెట్‌, కళాశాల స్టూడెంట్‌ ఐడీ కార్డుతో, మాస్కులు ధరించి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.


 

ఆర్టీసీలో ఇందన పొదుపు మాసోత్సవాలు

కర్నూలు(రూరల్‌), జనవరి 19: కర్నూలు-2 డిపో గ్యారేజిలో మంగళవారం ఇందన పొదుపు మాసోత్సవాలు నిర్వహించారు. ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ టీవీ రామం, డిప్యూటీ సీఎంఈ రవిశంకర్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు కొన్ని మెళకువల ద్వారా ఇంధనం పొదుపు చేయవచ్చన్నారు. కేఎంపీఎల్‌ మెరుగు పరచుకుని సంస్థపై పడే ఖర్చులు తగ్గించాలన్నారు. ఇందులో మెకానిక్‌ల పాత్ర కీలకమన్నారు. 

===============

మాట్లాడుతున్న చిన జీయర్‌స్వామి

ధర్మ రక్షణకు క ట్టుబడి ఉండాలి

త్రిదండి చిన జీయర్‌ స్వామి

కర్నూలు(కల్చరల్‌), జనవరి 19: ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని త్రిదండి చిన జీయర్‌ స్వామి ఉద్బోధించారు. మంగళవారం స్థానిక దేవీ ఫంక్షన్‌ హాలులో సమరసత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వధర్మ ఆచరణ మహాయజ్ఞం, బంధు సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఏ మతాలు లేవని, కాలగమనంలో అనేక మతాలు వచ్చినా ఎవరి మత విశ్వాసాలు వారివేనని అన్నారు. మతం మనిషికి క్రమశిక్షణ నేర్పేలా ఉండాలని, ఇతర మతాలను గౌరవించేలా మనిషి ఎదగాలని అన్నారు. మన దేవుళ్లను పూజించుకుందామని, అలాగే మనది కానిదాన్ని గౌరవిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు మంచిది కాదని, దీని ప్రభావం సమాజంపై చూపిస్తుందని అన్నారు. హిందూ ఆలయాలపై ఓ పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలకు ఎవరైనా రావచ్చని, ఇందుకు నిబంధనలేవీ లేవని వెయ్యేళ్ల క్రితం రామానుజార్యులు తెలియజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో త్రిదండి అహోబల స్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T05:33:44+05:30 IST