పండ్ల తోటలు పెంచుకోవాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-12-03T05:34:55+05:30 IST
జాతీయ ఉపాధి హామీ కింద పండ్ల తోటలను పెంచుకొని అధిక లాభాలను పొందవచ్చని కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు.
జూపాడుబంగ్లా, డిసెంబరు 2: జాతీయ ఉపాధి హామీ కింద పండ్ల తోటలను పెంచుకొని అధిక లాభాలను పొందవచ్చని కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని పారుమంచాల, తంగడంచ గ్రామాల పరిధిలో సాగు చేసుకున్న నిమ్మ తోటలను పరిశీలించారు. రైతులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే రాయితీ, పండ్ల తోటల పెంపకానికి మూడేళ్లపాటు ఇచ్చే మెయింట్నెస్ చార్జీలను పొందాలని అన్నారు. పండ్ల తోటలను పెంచుకుంటే 20 ఏళ్లపాటు రైతు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఉపాధి, ఉద్యానవన శాఖ అధికారులు చూడాలని ఆదేశించారు. అనంతరం తంగడంచ, మండ్లెం గ్రామాల్లో గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. అసంపూర్తిగా ఉన్న సచివాలయాలను త్వరతిగతిన పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో శోభారాణి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, ఈవోఆర్డీ మణిమంజరి, పీఆర్ఏఈ బషీర్, వ్యవసాయ అధికారి వెంకట రంగారెడ్డి పాల్గొన్నారు.
ఓటీఎస్పై లబ్ధిదారులకు అవగాహన
పాములపాడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై కలెక్టర్ కోటేశ్వరరావు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. వన్టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధిదారులకు సంపూర్ణ గృహ హక్కు లభిస్తుందని గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీలు మొదట రుణ విముక్తి పత్రాలను అందజేస్తారని తెలిపారు. అలాగే ఎర్రగూడూరు మండల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల పరిశుభ్రత, విద్యార్థులకు అన్నం వడ్డించే తీరుపై ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగూడూరులోని తమ పంట పొలంలో పాఠశాలను ఏర్పాటు చేశారని, అంతేగాకుండా శ్మశానానికి వినియోగిస్తున్నారని ఆంజనేయులు అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అలాగే బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ను పరిశీలించి పోతిరెడ్డిపాడు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.