రైతుల రికార్డులు మాయం
ABN , First Publish Date - 2021-05-05T05:41:44+05:30 IST
బనగానపల్లె మండలంలో గత కొద్దిరోజులుగా పొలం రికార్డులు ఆన్లైన్లో కనిపించడం లేదు.

బనగానపల్లె, మే 4: బనగానపల్లె మండలంలో గత కొద్దిరోజులుగా పొలం రికార్డులు ఆన్లైన్లో కనిపించడం లేదు. మీసేవా కేంద్రాల్లో, గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్లో తమ పేర్ల కింద పొలాల రికార్డులు కనబడడం లేదని రైతులు తహసీల్దారు కార్యాలయానికి వస్తున్నారు. ముఖ్యంగా 1బీ రికార్డులు కనబడడం లేదంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు కావాలంటే తప్పనిసరిగా బ్యాంకుల్లో ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంది. రుణాలు తీసుకోవాలంటే 1బీ రికార్డులు బ్యాంకు అధికారులు అడుగుతున్నారు. కానీ 1బీ రికార్డులు మీసేవా కేంద్రాల్లోను, సచివాలయాల్లోను కనబడలేదని తహసీల్దారు కార్యాలయానికి వెళితే సాంకేతిక సమస్య తలెత్తిందని అంటున్నారు. కరోనాను అడ్డుపెట్టుకొని సమస్యను పట్టించుకోవడం లేదని, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 1బీ రికార్డులు ఎలా మాయమవుతున్నదీ రెవిన్యూ అధికారులు తేల్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాంకేతిక సమస్యలే: తహసీల్దారు ఆల్ఫ్రెడ్
సాంకేతిక సమస్య వల్లనే రైతుల 1బీ రికార్డులు కనబడటం లేదు. రైతులు తమ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చు. సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.