ఇవేం బియ్యం?
ABN , First Publish Date - 2021-11-28T06:18:53+05:30 IST
మంత్రాలయంలో పంపిణీ చేసిన రేషన్ బియ్యంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- ప్లాస్టిక్వని అనుమానాలు
- మంత్రాలయంలో కలకలం
మంత్రాలయం, నవంబరు 27: మంత్రాలయంలో పంపిణీ చేసిన రేషన్ బియ్యంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం తెచ్చుకున్న మహిళలు అన్నం వండబోతే నీటిలో తేలియాడుతూ కనిపించటంతో ఆందోళనకు గురయ్యారు. శనివారం ఓల్డుటౌన్కు చెందిన బోయ పులికుక్క లక్ష్మి డీలరు నుంచి బియ్యం తెచ్చుకుంది. బియ్యం నీటిలో తేలియాడటం, వండిన తరువాత అన్నం మెతుకులు పొడవుగా ఉండటం గమనించి ప్లాస్టిక్ బియ్యం కలిశాయన్న అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో అలాంటి బియ్యం గింజలను వేరుచేసి మురుగు కాలువలో పడేశామని ఆమె తెలిపింది. బసమ్మ, పార్వతి, కాశమ్మ, గీతమ్మ కూడా తమకు ఇలాంటి బియ్యం వచ్చాయని తెలిపారు.
ఫుడ్ కార్పొరేషన్కు పంపిస్తాం
అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి నుంచి బియ్యం సేకరించి ఫుడ్ కార్పొరేషన్కు టెస్టింగ్ కోసం పంపిస్తాం. వారి ఇంటికి వె ళ్లి పరిశీలించి నివేదిక పంపాలని తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ ఆదామును ఆదేశించాం. రాష్ట్రంలో అక్కడక్కడా ప్లాస్టిక్ బియ్యం కల్తీ జరిగాయనే పుకార్లు వచ్చాయి. వీటిని ల్యాబ్లో టెస్టింగ్ చేస్తే నిర్ధారణ కాలేదు.
- రామకృష్ణారెడ్డి, ఆదోని ఆర్డీవో