ఆవిరవుతున్న ఆశలు

ABN , First Publish Date - 2021-08-26T05:13:32+05:30 IST

రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.

ఆవిరవుతున్న ఆశలు
కోసిగిలో ఎండిపోతున్న వేరుశనగ పంట

  1. చినుకు లేక ఎండిపోతున్న పంటలు
  2. ఖరీఫ్‌ కథ ముగిసినట్టేనంటున్న రైతులు

కోసిగి, ఆగస్టు 25: రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. చినుకు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇక ఖరీఫ్‌ కథ ముగిసినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరంభంలో పడిన వర్షపు చినుకులే తప్ప ఆ తరువాత చినుకు జాడ లేదు. మొలకెత్తిన మొక్కలకు చుక్క నీరు కరువైంది. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. సుమారు నెల రోజులుగా నీటి చుక్క నేలపై రాలలేదంటే.. రైతుల ఆవేదన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి ఖరీఫ్‌ సీజన్‌లో వేరుశనగ, పత్తి వంటి పంటలు పది వేల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు. గత ఏడాది కూడా అంతంత మాత్రమే వర్షాలు కురవడంతో సరైన దిగుబడి రాక.. గిట్టుబాటు ధర ల్లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా రూ.లక్షలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేశారు. అప్పటి వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయి. పంట చేతికొచ్చే సమయంలో  వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా వాడుముఖం పట్టి రైతుల ఆశలు అడియాశలు చేస్తున్నాయి. వరుణ దేవుడా కరుణించు అంటూ మండలంలోని రైతులు ఆకాశం వైపు జాలిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఖరీఫ్‌ కూడా తమను నట్టేట ముంచినట్లేనని ఆవేదనకు గురవుతున్నారు. ఎండు ముఖం పట్టిన పొలాలను చూడలేక ఇంటి దగ్గరే రైతులు మిన్నకుండిపోతున్నారు.


Updated Date - 2021-08-26T05:13:32+05:30 IST