పల్లె జనం పట్టరా?
ABN , First Publish Date - 2021-07-24T05:32:41+05:30 IST
పల్లె జనం పాలకులకు పట్టడం లేదు.

- ఏళ్లుగా రహదారి కష్టాలు
- బస్సులు తిరగని గ్రామాలెన్నో..
ఆళ్లగడ్డ, జూలై 23: పల్లె జనం పాలకులకు పట్టడం లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఆరు మండలాల్లో 102 గ్రామ పంచాయతీలు, 43 మజరా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 3.25 లక్షల జనాభా, 2.21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలే తప్ప సమస్యలకు పరిష్కా రం చూపడం లేదు. ఇప్పటికి 60 శాతం గ్రామాల ప్రజలు మట్టి రోడ్లపైనే నడుస్తున్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద వేసిన రోడ్లు కంకర తేలి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారాయి.
బస్సు సర్వీసుల రద్దుతో ఇబ్బంది
గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని పల్లె వెలుగు, తెలుగు వెలుగు పేరుతో బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రహదారులు బాగున్నా ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాలు 50 శాతం ఉన్నాయి. ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల డిపో మేనేజర్లకు మొరపెట్టుకున్నా ఆటోలు నడుస్తున్నాయనే నెపంతో పల్లె సర్వీసులను రద్దు చేశారు.
వర్షాలు వస్తే అంతే
కొన్ని గ్రామాలకు రహదారులు బాగున్నా వంతెన సమస్యలు వేధిస్తున్నాయి. వర్షాలు వస్తే చాలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి పోతున్నాయి. నియోజకవర్గంలోని శిరివెళ్ల-రుద్రవరం మండలాల మధ్య నేల వంతెనలు ఉండటంతో కొద్దిపాటి వర్షానికే వర్షపు నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి.
బాగుపడేది ఎపుడో..!
గ్రామాల రహదారులను బాగు చేయాల్సి ఉంది. గుంతలమయమైన రహదారులపైనే వెళ్లాల్సి వస్తోంది. కోటకందుకూరు రహదారి పూర్తి అధ్వానంగా ఉంది. ఇలా ఎన్నొ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. బాగు చేస్తే బాగుంటుంది.
- అబ్దుల్, కోటకందుకూరు