పకడ్బందీగా పోలింగ్ నిర్వహించండి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-02-06T05:40:59+05:30 IST
ఈనెల 9వ తేదీన జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ అన్ని మండలాల ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్), ఫిబ్రవరి 5: ఈనెల 9వ తేదీన జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ అన్ని మండలాల ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల స్థాయి ఎన్నికల నిర్వహణ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్, సరైన లైటింగ్, తాగునీరు, ఫర్నీచర్ తదితర సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్పంచ్, వార్డుమెంబర్ల వారీగా స్టేజీ-1, స్టేజీ-2 బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేందుకు రూట్మ్యాప్, రూట్ ఆఫీసర్లు బందోబస్తుతో కార్యాచరణ ప్రణాళి ప్రకారం పంపాలన్నారు. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించి మధ్యా హ్నం 3.30 గంటల వరకు ముగించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల న్నారు. అలాగే ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆయన సూచించారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.