టీడీపీ డోన్ ఇన్చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-10-29T05:17:22+05:30 IST
డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది.
డోన్, అక్టోబరు 28: డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ధర్మవరం సుబ్బారెడ్డి పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. మద్దతుదారులకు అండగా నిలిచి సహకారాలు అందించారు. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొన్నారు. ఇవన్నీ సుబ్బారెడ్డికి కలిసి వచ్చాయి. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ నమ్మకాన్ని నిలబెడతా: ధర్మవరం సుబ్బారెడ్డి
టీడీపీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని డోన్ నియోజకవర్గ టీడీపీ నూతన ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడుతానన్నారు. తనకు ఇన్చార్జిగా అవకాశం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు, కోట్ల, కేఈ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.