కరువు మండలంగా ప్రకటించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2021-10-26T05:15:48+05:30 IST

గోనెగండ్లను కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించాలని టీడీపీ మండల నాయకుడు, మండల మాజీ వైస్‌ ఎంపీపీ బుడ్డప్ప, తెలుగు రైతు సంఘ నాయకుడు దరగలమాబు, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కౌలుట్లయ్యనాయుడు, టీడీపీ నాయకులు మిన్నల్ల, ఎస్‌ఎన్‌మాబువలి డిమాండ్‌ చేశారు.

కరువు మండలంగా ప్రకటించాలి: టీడీపీ

గోనెగండ్ల, అక్టోబరు 25: గోనెగండ్లను కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించాలని టీడీపీ మండల నాయకుడు, మండల మాజీ వైస్‌ ఎంపీపీ బుడ్డప్ప, తెలుగు రైతు సంఘ నాయకుడు దరగలమాబు, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కౌలుట్లయ్యనాయుడు, టీడీపీ నాయకులు మిన్నల్ల, ఎస్‌ఎన్‌మాబువలి డిమాండ్‌ చేశారు. సోమవారం గోనెగండ్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. మండలంలో ఎక్కువగా ఉల్లి, పత్తి, వేరుశనగ, ఆముదాలు, సజ్జ, జొన్న, పంటలను  సాగు చేస్తారన్నారు. ఈ ఏడాది వర్షం కురియక పోవడంతో పత్తి పూర్తిగా ఎండిపోయిందని అన్నారు. 455 ఎంఎంలు ఉండాల్సిన వర్షపాతం కేవలం 396 ఎంఎంలు కురిసిందన్నారు. ఉల్లి పంటకు గిట్టు బాటు ధర లభించలేదని అన్నారు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. పంటలు ఎండిపోవడంతో రైతులు  అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు బ్యాంకు  రుణాలు ఇవ్వాలని, కరువు పరిహారం కింద రైతులకు ఎకరానికి రూ. 30,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం తహసీల్దార్‌ వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్బర్‌, కడపల చిన్న వెంకటేశ్‌, పెద్దమరివీడు అబ్దుల్‌, డలర్‌ ఫకృద్దీన్‌, కృష్ట, గుండెకాయ చిన్న రంగన్న, కడపల భీమన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:15:48+05:30 IST