కర్ఫ్యూ కఠినంగా అమలు
ABN , First Publish Date - 2021-05-06T05:26:10+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రెండు వారాల పాటు కర్ప్యూ నిబంఽధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ పక్కీరప్ప తెలిపారు.
మంత్రాలయం, మే 25: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రెండు వారాల పాటు కర్ప్యూ నిబంఽధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ పక్కీరప్ప తెలిపారు. బుధవారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామ సమీపంలోని సరిహద్దు చెక్పోస్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్కడి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని, అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదన్నారు. కర్ప్యూను పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దులోని చెక్పోస్టుల వద్ద అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. విచ్చల విడిగా జనాలు రాకపోకలు కొన్నసాగిస్తే సహించేదిలేదని అన్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కొవిడ్ పరీక్షలు చేసుకున్న తరువాతే రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని ఇతర రాష్ట్ర జనాలకు సూచించి సరిహద్దులోకి వచ్చిన వారిని తిరిగి పంపించారు. కార్యక్రమంలో డీఎస్పీ వినోదుకుమార్, సీఐ కృష్ణయ్య, ఎస్ఈబీ సీఐ మున్నా, ఎస్ఐ బాబు, సిబ్బంది ఉన్నారు.
కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ప్యూ గ్రామాల్లో కూడ అమలు చేస్తున్నామని తహసీల్దార్ చంద్రశేఖర్, సీఐ కృష్ణయ్య అన్నారు. బుధవారం మండలంలోని మాధవరం చెక్పోస్టును పరిశీలించి వగరూరు గ్రామంలో కొవిడ్ నిబంధనల్లో భాగంగా కర్ప్యూపై అవగాహన కల్పించారు. చెక్పోస్టు వద్ద కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి అనవసరంగా వస్తున్న జనాలను అడ్డుకొని తిరిగిపంపించారు. అత్యవసర పని మీద బయటకు వచ్చేటప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
ఆదోని టౌన్: కర్నూలు జిల్లాలో కరోనా ఉధృతిని అరికట్టడానికి కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ అన్నారు. బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించి కర్ఫ్యూ సందర్భంగా తీసుకొంటున్న చర్యల గురించి వివరించారు. ఇతర రాష్ట్రాల నుండి వాహనాల రాకపోకలను నిషేధిస్తూ క్షత్రగుడి ప్రాంతంలో మాధవరం, పెద్దహరివాణం గ్రామాల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఆదోని రూరల్: కరోనా నివారణలో భాగంగా కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నామని ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె సిబ్బందితో కలిసి కర్ణాటక సరిహద్దు ప్రాంతం పెద్దహరివానం చెక్పోస్టు దగ్గర తనిఖీ చేశారు.
ఆలూరు: కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కర్ఫ్యూకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆలూరు సీఐ భాస్కర్ కోరారు. బుధవారం ఆలూరు-గుంతకల్లు క్రాస్లో కర్ఫ్యూను పర్యవేక్షించారు.
ఎమ్మిగనూరు: కరోనా రెండోదశ విజృంభిస్తున్నందు వల్ల ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందని, అందరూ నిబంధనలు పాటించాలని ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్ అన్నారు. బుధవారం స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీనివాసనాయక్ ఆధ్వర్యంలో వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆర్డీఓ, డీఎస్పీలు మాట్లాడుతూ జీఓ ప్రకారం రెండువారాలు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జయన్న, ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణంలో పర్యటించిన ఆర్డీఓ, డీఎస్పీలు ః ఎమ్మిగనూరు పట్టణంలో 12గంటల తరువాత కర్ఫ్యూ అమలును ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్ పట్టణంలో పర్యటించి పరిశీలించారు. వీరి వెంట తహసీల్దార్ జయన్న, ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాసనాయక్, రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
