హమ్మయ్య..! కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది..!!
ABN , First Publish Date - 2021-01-14T05:24:59+05:30 IST
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే కొవిడ్ వ్యాక్సిన్ జిల్లాకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా 40,500 డోసులను పంపించింది.
- జిల్లాకు చేరిన 40,500 డోసులు
- 16న 2,700 మందికి వ్యాక్సినేషన్
కర్నూలు(హాస్పిటల్), జనవరి 13: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే కొవిడ్ వ్యాక్సిన్ జిల్లాకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా 40,500 డోసులను పంపించింది. గన్నవరం నుంచి ప్రత్యేక వాహనంలో జిల్లాకు బుధవారం వ్యాక్సిన్లు చేరుకు న్నాయి. వ్యాక్సిన్ బాక్సులను పోలీసు బందో బస్తు మధ్య ఇమ్యునైజేషన్ కేంద్రంలో డీఎంహెచ్వో డా.బి.రామ గిడ్డయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి స్వీకరిం చారు. ఇమ్యునైజేషన్ కేంద్రం కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచారు.
27 కేంద్రాలకు తరలింపు
జిల్లాకు వచ్చిన కరోనా వ్యాక్సిన్ను తొలి విడతగా 27 కేంద్రాలకు తరలిస్తున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. డీఐవోతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. వ్యాక్సినేషన్ కోసం ప్రతి నియోజకవర్గంలో రెండు సెషన్ సైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సిన్ను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజీ సెంటర్లో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి టీకా కేంద్రంలో వెయిటింగ్ హాల్, రిజిస్ర్టేషన్, వ్యాక్సినేషన్ అబ్జర్వరేషన్ గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 16న 2,700 మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తామని, ప్రజా ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 40,500 డోసులు, 4,050 వయల్స్ జిల్లాకు వచ్చాయని, ఒక్కొక్క వయల్స్ నుంచి 10 మందికి టీకా వేయవచ్చునని డీఐవో తెలిపారు. జిల్లాకు వచ్చిన వ్యాక్సిన్ను నాలుగు రూట్లలో తరలిస్తున్నామని తెలిపారు. ప్రతి టీకా కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ భద్రపరిచిన ఇమ్యునైజేషన్ కేద్రానికి షిఫ్ట్కు నలుగురు పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. డాక్టర్ రేఖ, ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సెలవులు ఉండవు: కలెక్టర్
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ విధులు ఉన్న జిల్లా అధికారులు, సిబ్బందికి ఈ నెల 15, 16 తేదీలలో సెలవులు ఉండవని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి జిల్లాలో మొదటి విడత హెల్త్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 15న మరోమారు కొవిడ్-19 వ్యాక్సినేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నా మన్నామని తెలిపారు. ప్రతి టీకా కేంద్రంలో సుశిక్షితులైన ఐదుగురు వ్యాక్సినేషన్ అధికారులు ఉంటారని తెలిపారు.
వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో దుష్ఫలితాలు కనబడితే వెంటనే వైద్యం చేయడం, అవసరమైతే ఆసుపత్రికి తరలించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. వ్యాక్సినేషన్ చేసిన తర్వాత ధ్రువపత్రం జారీ చేస్తామని, దాని ఆధారంగానే 28వ రోజున రెండో విడత వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. ప్రతి టీకా కేంద్రంలో రోజుకు వంద మందికి, నిర్దేశిత సమయంలో వ్యాక్సిన్ వేస్తామని, మొబైల్ నెంబర్కు వచ్చిన సంక్షిప్త సందేశాన్ని చూపించాల్సి ఉంటుందని తెలిపారు.