తగ్గని కరోనా తీవ్రత
ABN , First Publish Date - 2021-04-11T05:18:27+05:30 IST
జిల్లాలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి.
- రోజురోజుకు పెరుగుతున్న కేసులు
- తాజాగా జిల్లాలో 296 మందికి కరోనా
- కర్నూలు నగరంలోనే 160 కేసులు
కర్నూలు(హాస్పిటల్/ఎడ్యుకేషన్), ఏప్రిల్ 10: జిల్లాలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలోనే 160 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆదోని మున్సిపాలిటీలో 26, నంద్యాల మున్సిపాలిటీలో 13, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 9, వెల్దుర్తిలో 7, బనగానపల్లెలో 5, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 5, కోవెలకుంట్లలో 6, డోన్ మున్సిపాలిటీలో 6, ఆత్మకూరు మున్సిపాలిటీలో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 62,872 కేసులునమోదు కాగా 1,230 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 10 రోజుల్లోనే 1,283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పాఠశాలల్లో ఒకేరోజు 24 కేసులు
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారు. విద్యాసంస్థల్లో ఇప్పటివరకు 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో టీచర్లు, సిబ్బంది 78 మంది కాగా.. విద్యార్థులు 415 మంది ఉన్నారు. శుక్రవారం 10 కేసులు నమోదు కాగా శనివారం ఒకే రోజు 24 కేసులు నమోదయ్యాయి.