గ్రామాల్లో..
ABN , First Publish Date - 2021-01-14T05:20:38+05:30 IST
నంద్యాలలో బుధవారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
![గ్రామాల్లో..](https://media.andhrajyothy.com/appimg/galleries/2021011311470192/01132021234857n16.jpg)
- వైభవంగా భోగి వేడుకలు
నంద్యాల (కల్చరల్), జనవరి 13: నంద్యాలలో బుధవారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున భోగిమంటలు వేసారు. అనంతరం మహిళలు ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసారు. ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు పెట్టి అలంకరించారు.
సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఆయిష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో భోగి మంటలు, కోలాటం కార్యక్రమం చేపట్టారు. చిన్నారులకు భోగిపండ్లు పోశారు. ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. కోలాటం పోటీలలో పాల్గొన్న వారికి, సాంప్రదాయ దుస్తులు ధరించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
బాలాజీ కాంప్లెక్స్ భోగిమంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతి, వేదవతి, పుష్పలత, ప్రియాంక, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల (ఎడ్యుకేషన్): సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమే సంక్రాంతి పర్వదినమని వైసీపీ సీనియర్ నాయకుడు జగదీశ్వరరెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ కౌన్సిలర్ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను దేవనగర్లో నిర్వహించారు. 250 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలకు వరుసగా రూ.15 వేలు, రూ.12500, రూ.10 వేలు, రూ.7500, రూ.5 వేలు అందజేయనున్నట్లు మాజీ కౌన్సిలర్ దిలీప్కుమార్ తెలిపారు.
బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలోని గ్రామాల్లో, పట్టణాల్లో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి భోగి పండుగ జరుపుకున్నారు. బుధవారం గ్రామాల్లో ఇళ్ల ముంగిట భోగిమంటలు వేశారు. రంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్లను అలంకరించారు.
ఆళ్లగడ్డ: పట్టణంలోని సామెల్ వీధిలోని హెఎం స్పోకెన్ ఇంగ్లీషు పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం భోగి మంటలు వేసుకవున్నారు. ఇందులో లాయరు నీలకంఠేశ్వరం, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తాలుకా అధ్యక్షుడు అమీర్బాషా, ప్రజ్ఞ విద్యా సంస్థల అధినేత నరసింహరెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గంలో భోగి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు పొద్దున్నే ఇంటి ఎదుట రంగవల్లికలతో అలకరించారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి పాటలు పాడారు. హరిదాసులు సంకీర్తనలు వీధుల్లో వినిపించాయి. పిల్లలు, యువకులు గాలిపటాలతో పండుగ సందడిని చాటిచెప్పారు.
బండి ఆత్మకూరు: మండలంలోని పలు గ్రామాల్లో భోగి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం వేకువ జాముననే మహిళలు తమ ఇంటి ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దారు. భోగి మంటలు వేసి ఆనందించారు. అనంతరం చిన్నారులకు భోగి స్నానాలు చేయించారు. బండిఆత్మకూరులో సుంకులమ్మ దేవతకు మహిళలు బోనాలు సమర్పించారు.
మహానంది: మహానంది మండలంలోని గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భోగి మంటలు వేసుకొని యువత వేడుకలు జరుపుకున్నారు. మహిళలు ఇళ్ళ ముందు రంగుల రంగుల ముగ్గులను వేశారు. భోగి పండ్లతో చిన్నారులకు తలంటు స్నానాలు చేయించారు.
నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో భోగి పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. భోగి పండుగ సందర్భంగా వాడవాడల ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో కళకళలాడాయి. తెల్లవారుజామున భోగిమంటలను వేసుకున్నారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కన్నుల పండువగా గోదా కల్యాణం
ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో భోగి పండుగను పురస్కరించుకొని గోదాదేవి అమ్మవారికి, ప్రహ్లాదవరదస్వామికి బుధవారం కళ్యాణం చేసినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, మఠం మేనేజరు వైకుంఠస్వామి తెలిపారు. ధనుర్మాస పూజలు రేపటితో ముగియనున్నడటంతో గోదాదేవికి కళ్యాణం నిర్వహించామని తెలిపారు.
ఆళ్లగడ్డలోని మల్లన్న నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అర్చక స్వామి బాలాజీస్వామి బుధవారం తెలిపారు.
నంద్యాల (కల్చరల్): నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తిరుప్పావై వ్రత పరిసమాప్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గోదాదేవి సమేత రంగనాథస్వామి కళ్యాణం నిర్వహించారు. డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు కళ్యాణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య పాల్గొన్నారు.
![](https://media.andhrajyothy.com/appimg/galleries/2021011311470192/01132021234916n18.jpg)