రాజస్థాన్లో ఛేజ్ చేసి..
ABN , First Publish Date - 2021-10-08T05:28:19+05:30 IST
డోన్లో ఏటీఎంకు కన్నం వేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
![రాజస్థాన్లో ఛేజ్ చేసి..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
డోన్, అక్టోబరు 7: డోన్లో ఏటీఎంకు కన్నం వేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాను తలపించే రీతిలో ఛేజింగ్ చేసి రాజస్థాన్కు చెందిన దొంగల ముఠాను పట్టుకుని జిల్లాకు తీసుకువచ్చారు. గత ఆగస్టు 30వ తేదీన డోన్ పట్టణంలోని కోర్టు రహదారిలో ఉన్న రెండు ఏటీఎంలలో దొంగల ముఠా రూ.65 లక్షలు నగదును చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏటీఎంల దొంగతనం కేసును ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చాలెంజ్గా తీసుకున్నారు. జిల్లాలోని డోన్, కర్నూలు పోలీస్స్టేషన్లతో పాటు మరో రెండు పోలీస్స్టేషన్లలోని సీఐలు, ఎస్ఐలతో నాలుగు పోలీసు టీమ్లను ఏర్పాటు చేశారు. డోన్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో సీసీ ఫుటేజీల ఆధారంగా కారులో వచ్చి దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత టోల్గేట్ల వద్ద కారు కనిపించకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. ఏకంగా లారీలోనే కారు ఎక్కించి చోరీ చేసిన డబ్బును రాజస్థాన్కు తరలించారు. అక్కడి దొంగల ముఠా డోన్లో దొంగతనం పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు జిల్లా పోలీసు బృందాలు 15 రోజులు రాజస్థాన్లో మకాం వేశాయి.
సినిమాను తలపించేలా..
రాజస్థాన్లో దొంగల ముఠాను పట్టుకోవడంలో సినిమాను తలపించింది. పోలీసు బృందాలు దొంగలను వెంటాడి పట్టుకున్నారు. ఈ క్రమంలో దొంగల ముఠా నుంచి తిరుగుబాటు ఎదురైనా.. ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో డోన్ పోలీస్స్టేషన్లో పని చేసే ఓ కానిస్టేబుల్కు చేయి విరిగింది. అయినా పోలీసులు సాహసోపేతంతో నలుగురు దొంగలను పట్టుకుని జిల్లాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం డోన్ సబ్ డివిజన్లోని ఓ పోలీస్స్టేషన్లో దొంగల ముఠాను విచారిస్తున్నారు. ఏటీఎంలో దొంగతనం చేసిన డబ్బు రికవరికి గురించి పోలీసు బృందం విచారిస్తోంది.
రెండో విడత జమ
చెక్కును అందజేస్తున్న అధికారులు
కర్నూలు(కలెక్టరేట్), అక్టోబరు 7: వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడత జిల్లాలోని డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని 51,678 డ్వాక్రా సంఘాలకు రూ.311.61 కోట్లు జమ చేశామని కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. గురువారం ఒంగోలు జిల్లా నుంచి వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ - స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మహిళా సంఘాలకు రెండో విడత స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్ర్కీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఎంపీ డా.సంజీవ్ కుమార్, నగర మేయర్ బీవై రామయ్య, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, డా.జె.సుధాకర్,జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ వెంకటేశులు, మెప్మా పీడీ రాధిక, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఏపీడీ శ్రీధర్ రెడ్డి పొదుపు సంఘాల మహిళ సభ్యులు తదితరులు పాల్గొని వీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా గత ఏడాది సెప్టెంబరులో మొదటి విడత రుణ మాఫీలో భాగంగా జిల్లాలోని 51,244 స్వయం సహాయ సంఘాలకు చెందిన 5,00,247 మంది మహిళలకు రూ.306.6 కోట్లు మహిళా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. రెండో విడతకు సంబంధించి జిల్లాలో డీఆర్డీఏ, మెఫ్మా ద్వారా జిల్లాలో మొత్తం 51,678 సంఘాలకు చెందిన 5,16,106 మంది మహిళలకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.311.61 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇందులో డీఆర్డీఏ 38,359 స్వయం శక్తి సంఘాల్లోని 3,82,916 మంది సభ్యులకు రూ.228.17 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మెప్మా పరిధిలో ఉన్న 13319 సంఘాల్లోని 1,33,190 మంది మహిళలకు రూ.83.44 కోట్లు రుణమాఫీ వర్తించిందన్నారు. ఈ నెల 18 వరకు వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డ్వాక్రా సంఘాల లభ్దిదారులకు రూ.311.61 కోట్ల చెక్కును ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేశారు.
కౌలు రైతు ఆత్మహత్య
గూడూరు, అక్టోబరు 7: గూడూరు పట్టణానికి చెందిన కౌలు రైతు ప్రసంగి (53) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు పట్టణానికి చెందిన కౌలు రైతు ప్రసంగి రెండేళ్ల నుంచి కౌలుకు తీసుకున్న ఐదెకరాల పొలంలో పత్తి పంట సాగు చేశాడు. అయితే సకాలంలో వర్షాలు పడక, అధిక వర్షాలు పడి పంట దిగుబడి రాక వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు రూ.3.50 లక్షల అప్పులు చేశాడు. ఈ సంవత్సరం వర్షాలు లేక పంట సరిగ్గా లేనందు వలన చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో కౌలు కు తీసుకున్న వ్యవసాయ పొలంలో బుధవారం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రసంగి భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.