నదిలో మహిళ మృతదేహం
ABN , First Publish Date - 2021-08-03T07:10:51+05:30 IST
వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పల్లెతుమ్మలపాలెంలో జరిగింది.
హత్య చేసి పడేశారని అనుమానం
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పల్లెతుమ్మలపాలెంలో జరిగింది. బంటుమిల్లి మండలం రామన్నమోడి గ్రామానికి చెందిన రామాని దుర్గ (35)ను బందరు మండలం కొత్త పల్లెతుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామాని పోతురాజుకు ఇచ్చి ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేశారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. దుర్గ సోమవారం కొత్తపల్లెతుమ్మలపాలెం సమీపంలో కృష్ణానదిలో శవమై తేలింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు దుర్గ మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాని దుర్గ మెడ, శరీరంపై బలమైన దెబ్బలు ఉన్నాయి. దుర్గను చంపేసి మృతదేహాన్ని కృష్ణానదిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మెడకు ఉరివేసినట్లుగా గుర్తులున్నాయని, చంపేసిన అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కృష్ణానదిలో పడవేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దుర్గ భర్త పోతురాజు పరారీలో ఉన్నాడని, దుర్గ మామను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు రూరల్ సీఐ కొండయ్య తెలిపారు.