బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2021-05-20T05:51:04+05:30 IST
బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి

సీపీ శ్రీనివాసులు
గుణదల, మే 19 : నిరాదారణకు గురైన వీధిబాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని నగర పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులు అన్నారు. కమిషనరేట్ పరిధిలో బుధవారం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 63 మందిని గుర్తించినట్లు తెలిపారు. వారికి కరోనా టెస్ట్లు నిర్వహించినట్టు చెప్పారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించిందన్నారు. వైద్య పరీక్షల అనంతరం వీరందరికీ మాస్క్లు, శానిటైజర్, పౌష్టిక ఆహారం పంపిణీ చేశామని తెలిపారు.
హనుమాన్జంక్షన్లో..
హనుమాన్జంక్షన్ : బాలలందరినీ రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సీఐ డి.వి.రమణ అన్నారు. ముస్కాన్ ఆపరేషన్లో భాగంగా బుధవారం హనుమాన్జంక్షన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలు అదుపులోకి తీసుకున్న 20 మంది బాలకార్మికులకు సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. హనుమాన్ జంక్షన్లోని పలు దుకాణాల్లో పని చేస్తున్న14 మంది చిన్నారులను ఎస్సైలు గౌతమ్ కుమార్, కె.ఉషారాణి అదుపులోకి తీసుకున్నారు. వీరవల్లిలో ఎస్సై మదీనాబాషా ఇద్దరిని, ఆగిరిపల్లిలో ఎస్సై పి.కిశోర్ నలుగురుని అదుపులోకి తీసుకున్నారని సీఐ చెప్పారు. స్థానిక కాకాని కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో వీధి బాలలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మాస్క్లు, శానిటైజర్లు,ఫేస్ షీల్డు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సైలు, ఐసీడీఎస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు బాలకార్మికులకు కౌన్సెలింగ్
పెనమలూరు : యనమలకుదురు, సనత్నగర్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుధంగా ఇద్దరు బాలకార్మికులు ఆయా మెకానిక్ షాపులో పనిచేస్తుండగా బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబరు ఫ్రాన్సిస్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపివేశారు.