కంకిపాడు వ్యాక్సినేషన్ కేంద్రంలో సౌకర్యాల లేమి
ABN , First Publish Date - 2021-05-16T06:40:44+05:30 IST
కొవిడ్ నిరోధక వ్యాక్సిన్ రెండో డోసు కోసం కంకిపాడు జెడ్పీ పాఠశాలకు వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీడకోసం టెంట్లు లేవు, మంచినీటి ఏర్పాట్లు లేవు.
కంకిపాడు, మే 15 : కొవిడ్ నిరోధక వ్యాక్సిన్ రెండో డోసు కోసం కంకిపాడు జెడ్పీ పాఠశాలకు వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీడకోసం టెంట్లు లేవు, మంచినీటి ఏర్పాట్లు లేవు. వ్యాక్సిన్ కోసం వచ్చి కొవిడ్ బారిన పడేలా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కంకిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో రెండో డోసు వ్యాక్సిన్ వేస్తున్నారన్న సమాచారం శుక్రవారం సాయంత్రం వరకు తెలియదు. శనివారం ఉదయం ఒక్కసారిగా వ్యాక్సిన్ వేస్తున్నారన్న సమాచారం రావడంతో ఉదయాన్నే పాఠశాల వద్దకు వందల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. టెంట్లు, మంచినీటి సదుపాయం, కుర్చీలు లేవు. టోకెన్ తీసుకునేందుకు వందల మంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. అటు పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు, మరో పక్క ఆశా వర్కర్లు వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిని అదుపు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వృద్ధులు గంటల తరబడి ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెంట్లు, కుర్చీలు, తాగు నీటి సరఫరా కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు ఎవరికి వారు మిన్నకుండి పోయారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ టి.వి. సతీష్ పంచాయతీ అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. కనీసం మంచినీటి ఏర్పాట్లు కూడా చేయలేదంటూ ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేసే తరగతి గదుల్లో కరెంటు సౌకర్యం కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.