దిశ పోలీస్ స్టేషన్కు టీఎన్ఎస్ఎఫ్ ర్యాలీ
ABN , First Publish Date - 2021-09-03T07:22:54+05:30 IST
దిశ చట్టం ఉన్నట్టా లేనట్టా అని మచిలీపట్నం పార్లమెంట్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎ్సఎఫ్) అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి ప్రశ్నించారు.

అడ్డుకున్న పోలీసులు
మచిలీపట్నం టౌన్ : దిశ చట్టం ఉన్నట్టా లేనట్టా అని మచిలీపట్నం పార్లమెంట్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎ్సఎఫ్) అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి ప్రశ్నించారు. గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు దిశ పోలీసు స్టేషన్కు ర్యాలీగా బయలు దేరిన టీఎన్ఎ్సఎఫ్ అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి, తెలుగు మహిళా నాయకురాలు బొప్పన నీరజ, పార్ల మెంటు ప్రచార కార్యదర్శి పి.వి.ఫణికుమార్, తెలుగు యువత నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులతో చిలకలపూడి సీఐ అంకబాబు చర్చలు జరిపారు. దీంతో ఆర్పేట సీఐ భీమరాజుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ సత్యసాయి మీడియాతో మాట్లాడారు. దిశ చట్టంతో 21 రోజుల్లో దోషులకు శిక్షపడేలా చేస్తామని సీఎం జగన్మోహనరెడ్డి చెప్పారని, అయితే గుంటూరులో హత్యకు గురయిన దళిత యువతి రమ్యశ్రీ కేసులో నిందితులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగు మహిళా నాయకురాలు ముల్పూరి సాయి కల్యాణి మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 500 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ప్రచార కార్యదర్శి పి.వి. ఫణికుమార్, టిఎన్ఎ్సఎఫ్ నాయకులు సుప్రవర్త్, కాజ రవితేజ, మనోజ్, నిఖిలేష్, మణికుమార్, అజీజ్, సాయిచంద్, అభినవ్, వీరాంజనేయులు, ఉప్పలపాటి ప్రవీణ్, తాతినేని రాహుల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకోవడం దుర్మార్గం : తలశిల
మహిళలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత విమర్శించారు. పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో స్వర్ణలత మీడియాతో మాట్లాడారు. తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎ్సఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.
కొల్లు రవీంద్ర హౌస్ అరెస్టు
గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయూలంటూ తెలుగుమహిళ, టీఎన్ఎ్సఎఫ్, యువత చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హౌస్ అరెస్టు చేశారు. ఇనకుదురు సీఐ రమేష్ ఆయనకు నోటీసు అందజేశారు. రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జగన్కు టీడీపీ నాయకుల ఫోబియా పట్టుకుందన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని ఊదరగొట్టారని, ఆ తర్వాత పత్తా లేరన్నారు. గుంటూరులో హత్యకు గురయిన రమ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.