ముంచుకొస్తోంది మూడో ముప్పు
ABN , First Publish Date - 2021-08-06T06:22:45+05:30 IST
ముంచుకొస్తోంది మూడో ముప్పు
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. త్వరలోనే థర్డ్వేవ్ కమ్ముకొస్తోందంటూ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. గత ఏప్రిల్, మేలో ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వేలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే, జూన్ నుంచి సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి తీసుకుని సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు. ఇంతలో డెల్టా వేరియంట్ రూపంలో థర్డ్వేవ్ తరుముకొస్తుండటంతో మళ్లీ అందరూ భయాందోళనలో ఉన్నారు. ఆగస్టులోనే కొవిడ్ మూడోదశ మొదలై, ఉధృతమై తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. వివిధ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాలు అప్రమత్తం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ముఖ్యమంత్రులను అప్రమత్తం చేశారు. మన రాష్ట్రానికి కూడా థర్డ్వేవ్ విస్తరించే అవకాశాలున్నాయని, దీనిని సమర్థంగా ఎదుర్కో డానికి ప్రజలు సన్నద్ధం కావాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పక్షం రోజులుగా రోజువారీ కరోనా కేసులు 300 పైగా నమోదవుతున్నాయి. మర ణాలూ అదే స్థాయిలో పెరిగాయి. ఆగస్టులో ఈ ఐదు రోజుల్లోనే 1,275 మంది వైరస్ బారినపడ్డారు. 15 మంది మరణించారు. తాజాగా వస్తున్న థర్డ్వేవ్లో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనేది నిపుణుల మాట.
నలుగురు మృతి.. 251 మందికి వైరస్
విజయవాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడి కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో గురువారం నలుగురు బాధితులు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 251 మంది వైరస్ బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,10,123కు పెరగగా, మరణాలు అధికారికంగా 1,226కు చేరాయి. జిల్లావ్యాప్తంగా వైరస్ బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,05,739 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 3,158 మంది చికిత్స పొందుతున్నారు.