పెట్రోలు ధర రెండువందలైనా ఆశ్చర్యంలేదు: Bonda uma
ABN , First Publish Date - 2021-08-27T18:40:07+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తిగా తగ్గిస్తానన్న హామీని విస్మరించిన జగన్, దేశంలోనే వాటిని ఎక్కువ
అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తిగా తగ్గిస్తానన్న హామీని విస్మరించిన జగన్, దేశంలోనే వాటిని ఎక్కువ ధరలకు అమ్మిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పిచారు. టీడీపీ హాయాంలో 60 రూపాయలున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు డబుల్ సెంచరీవైపు వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. 2018లో టీడీపీ హయాంలో కేంద్రం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే, చంద్రబాబు ఆ భారం ప్రజలపై పడకూడదని లీటరుకి రూ. 2 తగ్గించారని గుర్తుచేశారు. స్టేట్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్, జీఎస్టీ, రోడ్ల సెస్సు అంటూ ట్యాక్సుల మీద ట్యాక్సులేస్తూ జగన్ ప్రభుత్వం బాదుడు కార్యక్రమం చేపట్టిందని అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో లీటరు పెట్రోలు ధర రెండువందలైనా ఆశ్చర్యంలేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం పెట్రోల్ ధరలు పెంచుతున్నామని మంత్రులు పేర్కొనడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లలో ఎక్కడా ఒక కిలోమీటరు రోడ్డు వేసింది లేదని, ఒక గుంత పూడ్చిందిలేదని అన్నారు. టీడీపీ ఆధర్వ్యంలో రేపు చేపట్టబోయే నిరసన దీక్షల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, జగన్ దోపిడీని ఎండగట్టాలని బండా ఉమా పిలుపునిచ్చారు.