జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేను: నిమ్మగడ్డ

ABN , First Publish Date - 2021-03-24T18:08:34+05:30 IST

తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తెలిపారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేను: నిమ్మగడ్డ

విజయవాడ: తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయలేనని వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. హైకోర్ట్ తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ పేర్కొన్నారు.


గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని... పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అవలంభించిన మంచి పద్ధతులను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-24T18:08:34+05:30 IST