కూలిన బతుకులు
ABN , First Publish Date - 2021-03-15T06:51:03+05:30 IST
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. కాలువ కింద పనులు ఎక్కువగా ఉండటంతో కుప్ప నూర్పిడి పనులకు బయలుదేరారు. నాలుగు రూపాయలు వస్తాయనే ఆశ ఆదివారం అయినా వారిని గడపదాటించింది. ఆ ప్రయాణమే మృత్యు కూపంలోకి నెట్టింది. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఆటోలో బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి బయలుదేరిన 13 మందిలో ఆరుగురిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనపెట్టుకుంది.
నూజివీడు రూరల్, మార్చి 14: నూజివీడు మండలం సిద్ధార్థనగర్ గ్రామ శివారు లైన్తండాకు చెందిన కూలీలను బాపులపాడు మండలం, తిప్పనగుంట గ్రామానికి చెందిన రైతు కుప్ప నూర్పిడికి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున వడిత్యా రమేష్కు చెందిన ఆటోలో మేస్ర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 13 మంది కూలీలు బయలుదేరగా, గొల్లపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను హనుమాన్జంక్షన్ నుంచి నూజివీడు వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రమేష్(30), కూలీలు భూక్యా సోమిలి(45), బాణావతు బేబి(30), బాణావతు సోనా(50), భూక్యా నాగరాజు(29) అక్కడికక్కడే మృతి చెందగా, బాణావతు నాగు(30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడినవారిలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి, విజయవాడ తరలించారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐ వెంకట నారాయణ, ఎస్సై పండుదొర, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సబ్కలెక్టర్ ప్రతిష్టమంగైన్, తహసీల్దారు ఎం.సురేశ్కుమార్ తదితరులు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
విషాదంలో లైన్తండా
గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లైన్తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదం లైన్తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ తండాలోని వారంతా దాదాపు సమీప బంధువులే. ఐదు, ఆరు కుటుంబాల వారు ఒక జట్టుగా ఏర్పడి వ్యవసాయ పనులకు వెళతారు. ఆయా కుటుంబాల్లో కొందరు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడడం గ్రామంలో మరింత విషాదాన్ని నింపింది. గత ఏడాది కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వీరు ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో కుటుంబ పోషణ కోసం దూర ప్రాంతాలకు కూలి పనులకు వెళుతున్నారు. ఉన్న ఊరిలో పనులు లేకపోవడంతో దూర ప్రాంతాలకు పనులకు వెళుతూ ప్రమాదానికి గురవడం ఆ గ్రామానికి కోలుకోలేని విషాదానికి గురిచేసింది. మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. అయినవారి కోసం ఆప్తుల రోదనలు చూపరులను సైతం కలచివేశాయి.