రూ.4కోట్ల రుణానికి రూ.5లక్షల వసూలు

ABN , First Publish Date - 2021-03-04T06:56:25+05:30 IST

సాగువైపు ఆసక్తి పెంచుకున్న ఓ యువకుడికి రుణం పేరుతో ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ టోకరా వేసింది.

రూ.4కోట్ల రుణానికి రూ.5లక్షల వసూలు

ప్రైవేట్‌ బ్యాంక్‌ దారుణం

కృష్ణలంక పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

విచారణకు సహకరించని బ్యాంకు అధికారులు


విజయవాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సాగువైపు ఆసక్తి పెంచుకున్న ఓ యువకుడికి రుణం పేరుతో ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ టోకరా వేసింది. రూ.4కోట్ల వ్యవసాయ రుణం మంజూరు చేస్తామని చెప్పి రూ.5లక్షల వరకు వసూలు చేసి మోసం చేసింది. దీనిపై బాధితుడు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సురేశ్‌కుమార్‌ అనే యువకుడు తనకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. రుణం కోసం మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్‌ బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకులో రుణాల మంజూరుకు సంబంధించిన ఉద్యోగులు యువ వ్యవసాయదారులకు తమ వద్ద ప్రత్యేక పథకం ఉందని నమ్మబలికారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. రుణం మంజూరుకు ముందు జరిగే ప్రక్రియకు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ప్రాసెసింగ్‌ ఫీజులు, స్టాంప్‌డ్యూటీ వంటి ఇతరత్రా పనుల నిమిత్తం రూ.5లక్షలు వసూలు చేశారు. మూడు నెలల పాటు సాగదీసిన బ్యాంక్‌ ఉద్యోగులు ఇప్పుడు రూ.కోటి మాత్రమే మంజూరైందని చెప్పారు. ఇంకా ఎక్కువ రుణం కావాలంటే మరో ఐదు శాతం అదనంగా చెల్లించాలన్నారు. ఒకవేళ రూ.కోటి మాత్రమే చాలనుకుంటే తెల్ల కాగితాలపై సంతకాలు చేసి ఇవ్వాలని అడిగారు. దీనిపై సురేశ్‌కుమార్‌కు అనుమానం వచ్చింది. తనకు రుణం అవసరం లేదని, చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి బ్యాంక్‌ ఉద్యోగులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. మంజూరైన మేరకు రుణం తీసుకోవడం, రుణం వద్దనుకుంటే ముందుగా చెల్లించిన ప్రాసెసింగ్‌ ఫీజులు వదులుకోవాలని చెప్పారు. హామీగా తీసుకున్న ఆస్తి పత్రాలను ఇవ్వాలంటే మరో రూ.2లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీనిపై సురేశ్‌కుమార్‌ గతనెల 25న కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని బ్యాంక్‌ అధికారులకు నోటీసులు ఇచ్చారు. తమ బ్యాంకులో ఎలాంటి మోసం జరగలేదని చెబుతున్న అధికారులు విచారణకు మాత్రం హాజరుకావడం లేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-04T06:56:25+05:30 IST