కొనుగోలు కేంద్రాల్లేక రైతుల ఇబ్బందులు
ABN , First Publish Date - 2021-04-18T06:10:45+05:30 IST
దాళ్వా కోతలు ప్రారంభం అయ్యి పక్షం రోజులు గడిచినప్పటికీ కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తక్కువ ధరకు ధాన్యం సేకరిస్తున్న దళారులు
బంటుమిల్లి : దాళ్వా కోతలు ప్రారంభం అయ్యి పక్షం రోజులు గడిచినప్పటికీ కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులేదు. దీనికితోడు మిల్లర్లు కొనేందుకు సుముఖంగా లేకపోవడ ంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిల్వ ఉంటున్నాయి. సార్వా ధాన్యం నిల్వలతో గోదాములు ఖాళీ లేకపోవడంతో పాటు మరలా ధాళ్వా ధాన్యం రావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో మిల్లర్లు ఉన్నారు. గోదాముల్లో సార్వా ధాన్యం ఖాళీ అయితే దాళ్వా ధాన్యం ఎగుమతులకు అవకాశం ఏర్పాడుతుందని దాళారులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇష్టానుసారంగా మార్కెట్ నడుస్తోం దని, రైతులు అవసరాలను దృష్టిలో పెట్టుకున్న దాళారులు బస్తాకు రూ.400 నుంచి రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మధ్దతు ధర ప్రకటించి చేతికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లిస్తే రైతుకు ఊరట కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘం నాయకుడు గౌరిశెట్టి నాగేశ్వ రరావు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి తేమ శాతం ఆధారంగా న్యాయపరమైన ధరను చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలలు తరబడి ధాన్యం డబ్బులు కొరకు తిరగకుండా సకాలంలో నగదును వారి ఖాతాల్లో జమచేయాలన్నారు.