మేజర్‌ వాటా కోసమే..

ABN , First Publish Date - 2021-08-25T06:25:21+05:30 IST

జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో కరణం రాహుల్‌ నెలకొల్పిన జడ్‌ఎక్స్‌ఇన్‌ సిలిండర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 90శాతం వాటాను కోగంటి సత్యం తీసుకోవాలనుకున్నాడు.

మేజర్‌ వాటా కోసమే..
కోర్టుకు హాజరైన కోగంటి

రాహుల్‌ హత్యకు ‘కోగంటి’ స్కెచ్‌

రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు


విజయవాడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో కరణం రాహుల్‌ నెలకొల్పిన జడ్‌ఎక్స్‌ఇన్‌ సిలిండర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 90శాతం వాటాను కోగంటి సత్యం తీసుకోవాలనుకున్నాడు. దాన్ని రాహుల్‌ తిరస్కరించడంతో కంపెనీని తన వశం చేసుకోవడానికి కోగంటి స్కెచ్‌ వేశాడు. ఇవీ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు. కరణం రాహుల్‌ హత్య కేసులో ఏ2 కోగంటి సత్యంను మాచవరం పోలీసులు విజయవాడలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు అందజేసిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. ‘రాహుల్‌ 2016లో చెరువు మాధవరంలో జడ్‌ఎక్స్‌ఇన్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు. అందులో రాహుల్‌ వాటా 40శాతం. ఏ1గా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ 30శాతం, మరో భాగస్వామిది 20శాతం, ఇంకో భాగస్వామిది 10శాతం. కోరాడ విజయ్‌ కుమార్‌ 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఖర్చుల కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి కంపెనీలోకి తన వాటాను తీసుకుని డబ్బులు ఇవ్వమని రాహుల్‌ను అడిగాడు. దీనికి రాహుల్‌ అంగీకరించలేదు. ఇద్దరి మధ్య వివాదం రావడంతో కోరాడ తనకు పరిచయం ఉన్న కోగంటి సత్యంను కలిశాడు. కంపెనీని చూడడానికి వెళ్లిన సత్యం మొత్తం వాటాలో 90శాతం తనకు ఇవ్వమని అడిగాడు. 10శాతం వాటాను రాహుల్‌ను తీసుకోమని, కంపెనీ వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు. ఈ ప్రతిపాదనను రాహుల్‌ తిరస్కరించాడు. కంపెనీని వశం చేసుకోవాలనుకున్న సత్యం అది దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్నాడు. రాహుల్‌ హత్యకు స్కెచ్‌ సిద్ధం చేశాడు. దాన్ని కోరాడతో కలిసి మిగిలిన వారు అమలు చేశారు.’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-25T06:25:21+05:30 IST