సచివాలయాల్లో జగన్ పత్రికలు వేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-29T05:30:00+05:30 IST
సచివాలయాల్లో జగన్ పత్రికలు వేసుకోవాలి

నందిగామ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం
నందిగామ, అక్టోబరు 29 : నందిగామ పట్టణంలోని పది వార్డు సచివాలయాల్లో జగన్ దినపత్రికలను రెండేసి చొప్పున వేయించుకోవాలని మునిసిపల్ కౌన్సిల్ తీర్మానించింది. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మండవ వరలక్ష్మి అధ్యక్షతన నందిగామ మునిసిపల్ సమావేశం శుక్రవారం జరిగింది. మొత్తం 135 అంశాలపై తీర్మానాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఒక్కో కార్యాలయంలో రెండు జగన్ పేపర్లకు గానూ, ఒక్కో ప్రతికి రూ.1,000 సంవత్సర చందా చెల్లించాలని నిర్ణయించారు. గతంలో ఎప్పుడూ లేని ఈ సంప్రదాయంపై కమిషనర్ డాక్టర్ జయరామ్ను వివరణ కోరగా, దీనిపై ప్రభుత్వ జీవో ఉందని, త్వరలో జీవో ప్రతిని అందజేస్తామని చెప్పారు. ఒక కార్యాలయానికి ఒకే పత్రికకు చెందిన రెండు ప్రతులు ఎందుకని, దాని స్థానంలో మరో పత్రికను వేయిస్తే బాగుంటుందని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు.