ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు: మంత్రి పేర్ని నాని
ABN , First Publish Date - 2021-05-17T15:42:51+05:30 IST
కరోనా బాధితులకు మారుమూల ప్రాంతాల్లో..
మచిలీపట్నం టౌన్: కరోనా బాధితులకు మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసినట్టు రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. ఆదివారం ఆర్అండ్బీ అతిధి గృహంలో వైద్య, మునిసిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలోని పడకలు, ఆక్సిజన్ సరఫరాపై మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న దృష్ట్యా దాతలను ఆక్సిజన్ సిలెండర్లు అందచేయాలని కోరుతున్నామన్నారు. గ్రీన్కో సంస్థ అధినేత చలమలశెట్టి అనీల్ ఆక్సిజన్ సిలెండర్లు అందించారన్నారు. అలాగే దివీస్ ల్యాబ్స్, మచిలీపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆక్సిజన్ సిలెండర్లు అందిస్తున్నారన్నారు. ఎవరైనా డాక్టర్ కోర్సు, నర్సింగ్ కోర్సు ఫైనలియర్ విద్యార్ధులు ఉంటే వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు ఇస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఏజెన్సీ ఏరియాల్లో ఆర్టీసీ స్లీపర్ ఏసి బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఆర్డీవో ఖాజావలి, డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.