మడ భూములను పరిశీలించిన అధికారులు
ABN , First Publish Date - 2021-03-24T06:41:34+05:30 IST
బందరు మండలం పెదపట్నంలోని మడ భూములను మత్స్యశాఖ జేడీ, రెవెన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు.

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : బందరు మండలం పెదపట్నంలోని మడ భూములను మత్స్యశాఖ జేడీ, రెవెన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు. మడ భూముల్లో చెరువులు తవ్వుతున్న అంశంపై ఈనెల 23వ తేదీన ఆంధ్రజ్యోతి కృష్ణా ఎడిషన్లో ‘మడత పెట్టేశారు’ అనే శీర్షికతో వచ్చిన ప్రత్యేక కఽథనంపై అధికారులు స్పందించారు. మత్స్యశాఖ జేడీ షేక్ లాల్అహ్మద్, బందరు ఆర్ఐ యాకూబ్, పలువురు వీఆర్వోలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ మడ అడవిలో చెరువుల సాగు చేయడం, చిన్న చెరువులు గట్లను తొలగించి పెద్దచెరువులుగా మార్చేందుకు జరిగిన పనులను పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బందరు మండలం పెదపట్నం, బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామాల మధ్య సహజసిద్ధంగా పెరిగిన మడ అడవులను నరికివేయడం చట్టవిరుద్ధమన్నారు. మడ చెట్లను నరికి చెరువులు తవ్వే పనులు నిలిపి వేయకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎఫ్డీవో ద్వారా మడ అడవులను ధ్వంసం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నామని మత్స్యశాఖ జేడీ ఆంధ్రజ్యోతికి తెలిపారు.