బందరు మేయర్ అభ్యర్థి కొట్టె జయలక్ష్మి
ABN , First Publish Date - 2021-03-09T06:51:49+05:30 IST
మచిలీపట్నం నగర పాలక సంస్థకు మేయర్ అభ్యర్థిగా కొట్టె జయలక్ష్మి పేరును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
ప్రకటించిన టీడీపీ నేత లోకేశ్
మచిలీపట్నం టౌన్, మార్చి 8 : మచిలీపట్నం నగర పాలక సంస్థకు మేయర్ అభ్యర్థిగా కొట్టె జయలక్ష్మి పేరును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరాసుపేట సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో లోకేశ్ జయలక్ష్మి పేరును ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తొమ్మిదో డివిజన్ ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు తన సొంత నిధులతో కేవీఆర్ పార్కును అభివృద్ధి చేశారన్నారు. అప్పట్లో ఈ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దారన్నారు. కొట్టె వెంకట్రావు సతీమణి జయలక్ష్మి ఆయన బాటలో నడుస్తూ డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించాలని లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, టీడీపీ మేయర్ అభ్యర్థి పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన జయలక్ష్మికి ఇస్తున్నామన్నారు. దమ్ముంటే మంత్రి పేర్ని నాని వైసీపీ అభ్యర్థిని ప్రకటించాలన్నారు.