బందరు అభివృద్ధికి పాటుపడదాం

ABN , First Publish Date - 2021-10-31T06:27:05+05:30 IST

బందరు నగరాన్ని 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధిని సాధిస్తామని మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ అన్నారు.

బందరు అభివృద్ధికి పాటుపడదాం
కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ వెంకటేశ్వరమ్మ

 మేయర్‌ వెంకటేశ్వరమ్మ 

రూ.3.22 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 30 : బందరు నగరాన్ని  15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధిని సాధిస్తామని మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ అన్నారు. నగర పాలక సంస్థ హాలులో శనివారం అత్యవసర కౌన్సిల్‌ సమావేశం  జరిగింది.  మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ అధ్యక్షత వహించి ప్రసంగించారు.  రూ. 3 కోట్ల 22 లక్షల 68 వేల 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీర్మానించారు. అన్నపూర్ణమ్మ తల్లి ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి చేపల మార్కెట్‌ లీజుకు ఇచ్చేందుకు తీర్మానించారు. 41వ డివిజన్‌లో కుమ్మరిగూడెం పట్టిలకొట్టు వద్ద రూ. 3 లక్షల తో రోడ్డు నిర్మించేందుకు సమావేశంలో తీర్మానించారు. పాండురంగ స్వామి గుడి వెనుక పైపులైన్లు నిర్మించేందుకు 48వ డివిజన్‌లో వినాయకుడి గుడి నుంచి వనమలమ్మ గుడి వరకు పైపులైన్లు నిర్మించేందుకు సమావేశంలో తీర్మానించారు. 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ చింతా గిరి మృతి చెందడంతో ఆ డివిజన్‌ ఉప ఎన్నికకు రూ. 5 లక్షలు కేటాయించారు.  సమావేశంలో డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, కార్పొరేటర్లు పరింకాయల విజయ్‌, ఐనం తాతారావు పాల్గొన్నారు.


ఎనిమిది నిమిషాల్లో ముగిసింది - టీడీపీ

శ్మశానవాటిక అభివృద్ధికి కేటాయించిన నిధులు మళ్లించడం దురదృష్టకరమని టీడీపీ కార్పొరేటర్‌ మరకాని సమతాకీర్తి అన్నారు. కౌన్సిల్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కేవలం ఎనిమిది నిమిషాల్లో సమావేశం ముగించడం వల్ల ప్రజా సమస్యలను కౌన్సిల్‌ సమావేశంలో చెప్పలేకపోయామన్నారు. గత కౌన్సిల్‌ సమావేశానికి, ప్రస్తుత కౌన్సిల్‌ సమావేశానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు విపరీతంగా పెంచేశారన్నారు. కార్పొరేటర్లు అన్నం ఆనంద్‌, దింటకుర్తి సుధాకర్‌, దేవరపల్లి అనిత, జనసేన కార్పొరేటర్‌ పినిశెట్టి నాగఛాయాదేవి పాల్గొన్నారు.



Updated Date - 2021-10-31T06:27:05+05:30 IST