7669 మందికి టిడ్కో ఇళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-20T06:19:09+05:30 IST

గుడివాడలో అర్హులైన 7669 మంది లబ్ధిదారులకు గుడివాడ రూరల్‌ మండలం మల్లాయిపాలెంలో టిడ్కో గృహాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

7669 మందికి టిడ్కో  ఇళ్ల పంపిణీ

 మంత్రి కొడాలి నాని

గుడివాడ, జనవరి 19: గుడివాడలో అర్హులైన 7669 మంది లబ్ధిదారులకు గుడివాడ రూరల్‌ మండలం మల్లాయిపాలెంలో టిడ్కో గృహాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. స్థానిక రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో టిడ్కో గృహం విషయమై తనను కలిసిన వీ.రామిరెడ్డితో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ తనకు 430 చదరపు అడుగుల్లో నిర్మించే టిడ్కో గృహం మంజూరైందని తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సీ-33 బ్లాక్‌లో జీ-4 ఫ్లాట్‌ కేటాయిస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారని వివరించారు. తనకు కేటాయించిన గృహానికి సంబంధించి సచివాలయ సిబ్బంది ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. దీనికి మంత్రి కొడాలి నాని స్పందిస్తూ రెండు రోజుల్లో సచివాలయం ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు.  

 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్‌సీ) పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని మంత్రి కొడాలి నానిని కోరుతూ మంగళవారం గుడివాడలో వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 43 మంది వైద్యులు, 37 మంది స్టాఫ్‌నర్స్‌లు, 43 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 37 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు, 74 మంది ఏఎన్‌ఎంలు, 37 మంది హౌస్‌కీపింగ్‌ ఉద్యోగులు అపోలో సంస్థ నిర్వహిస్తున్న యూపీహెచ్‌సీల్లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కొవిడ్‌-19 సమయంలోనూ సేవలు అందించామని వివరించారు. నాలుగేళ్లుగా సేవలు అందిస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్న యూపీహెచ్‌సీల్లో నియామకాలు జరపమని ప్రభుత్వం జీవో జారీ చేసిందని అన్నారు. తమను యూపీహెచ్‌సీల్లోనే కొనసాగించి కొత్తగా ఏర్పడిన ఖాళీలలో కొత్త వారితో భర్తీ చేయాలని సిబ్బంది కోరారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ యూపీహెచ్‌సీ సిబ్బంది సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు.

Updated Date - 2021-01-20T06:19:09+05:30 IST