కిలేశపురంలో యువకుల ఘర్షణ!
ABN , First Publish Date - 2021-08-02T06:25:35+05:30 IST
ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురంలో బైకుల వ్యవహారంలో మొదలైన చిన్న ఘర్షణతో యువకులు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఒకరికి గాయాలయ్యాయి.
గ్రూపులుగా విడిపోయి పరస్పరం కర్రలతో దాడి
ఒకరికి గాయాలు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1 : ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురంలో బైకుల వ్యవహారంలో మొదలైన చిన్న ఘర్షణతో యువకులు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఒకరికి గాయాలయ్యాయి. గ్రామ పరిధిలోని ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు జలపాతం ఏరియా ఆకతాయిల అడ్డాగా మారిపోయింది. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పెద్దఎత్తున్న చుట్టు పక్కల గ్రామాల నుంచి, విజయవాడ నగరం నుంచి యువకులు జలపాతం వద్దకు వచ్చి స్నానాలు చేశారు. తిరుగు ప్రయాణంలో మోటార్ బైక్ల వద్ద వచ్చిన వివాదం ఘర్షణకు దారి తీసింది. యువకులు రెచ్చిపోయారు.
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి కింది భాగంలో కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఒక యువకుడిని చావ బాదారు. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకునే లోపు అందరూ పరారయ్యారు. గాయపడిన యువకుడిని కొందరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసింది.