దుర్గమ్మ సన్నిధిలో కమలానంద భారతీస్వామి
ABN , First Publish Date - 2021-08-27T06:19:56+05:30 IST
గన్నవరంలోని శ్రీ భువనేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతి కమలానందభారతి స్వామీజీ గురువారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ, ఆగస్టు 26 (ఆంఽధ్రజ్యోతి) : గన్నవరంలోని శ్రీ భువనేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతి కమలానందభారతి స్వామీజీ గురువారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన స్వామీజీకి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ జి.వాణీమోహన్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ వేదపండితులు స్వామీజీకి వేదస్వస్తి పలికారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అనంతర స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.
దసరా ఉత్సవాల నిర్వహణపై దుర్గగుడి అధికారుల చర్చ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల నిర్వహణపై దుర్గగుడి అధికారులు గురువారం చర్చించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ దసరా ఉత్సవాల్లో భక్తులు అమ్మవారిని సులువుగా దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆలయ ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు, ఆలయంలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.