డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2021-05-14T14:58:54+05:30 IST
కరోనా కష్టకాలంలో..
ట్రై ఏజ్ సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్
విజయవాడ: కరోనా కష్టకాలంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కలెక్టర్ ఇంతియాజ్ కొనియాడారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ట్రైఏజ్ సెంటర్ను కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ లక్షణాలతో వచ్చే ప్రజలకు వ్యాధి లక్షణాలను అనుసరించి ఏ ఆసుపత్రికి వెళ్లాలి, ఎక్కడ చికిత్స తీసుకోవాలనే సలహాలు, సూచనలను ట్రైఏజ్ సెంటర్లో వైద్యసిబ్బంది అందించడంతో పాటు వారికి మనోధైర్యం, వ్యాధి తీవ్రత, చికిత్స, ఆహారం వంటి అంశాలపై కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. కొవిడ్ ప్రారంభ దశలో తక్కువ లక్షణాలుంటే వైద్యసహాయం అందిస్తారన్నారు. ఇందులో మూడు షిప్టుల్లో 24 గంటల పాటు సిబ్బంది ఉంటారని, చికిత్సకు అవసరమైన పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు, ఇతర ఆసుపత్రులకు తీసుకుని వెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. హెల్ప్ డెస్క్, రిసెప్షెన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
ట్రైఏజ్ కేంద్రంలో బాధితుల సౌకర్యార్థం రూ.2.5లక్షలతో 50 బెడ్స్, బెడ్షీట్స్, పిల్లోస్, ఎయిర్ ప్యూరిఫచర్లు అందించిన అమెరికాకు చెందిన ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ సీఈవో ఆయేషా చారుగుళ్లను కలెక్టర్ అభినందించారు. జేసీ ఎల్.శివశంకర్, సబ్కలెక్టర్ హెచ్ఎం.ధ్యానచంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.శివశంకర్, ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ ఇండియాకు చెందిన కరణం కళ్యాణ కృష్ణకుమార్, కె.పవన్కుమార్, కె.శ్రీశ్యామ్ శరణ్ పాల్గొన్నారు. ట్రైఏజ్ కేంద్రానికి విరాళంగా సామగ్రి అందించే కార్యక్రమంలో సంస్థ సీఈవో ఆయేషా చారుగుళ్ల వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.