ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ మాకొద్దు
ABN , First Publish Date - 2021-08-28T04:54:00+05:30 IST
ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ మాకొద్దు
![ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ మాకొద్దు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082711230565/08272021232338n94.jpg)
కోశాధికారిపై భౌతిక దాడిని నిరసిస్తూ ఉద్యోగుల ధర్నా
గొల్లపూడి, ఆగస్టు 27 : ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తీరుకు నిరసనగా ఉద్యోగులు ఆ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఆయన మాకొద్దంటూ నినదించారు. ఉద్యోగుల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఎస్ఎస్సీ బోర్డు అసోసియేషన్ కోశాధికారిపై సుబ్బారెడ్డి దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఈ ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు కె.శ్రీనివాసులు, గోవింద్ నాయక్ మాట్లాడుతూ డైరెక్టర్ సుబ్బారెడ్డి మహిళా ఉద్యోగులతో రాత్రివేళల్లో పని చేయించడం, దివ్యాంగ ఉద్యోగులను సైతం నోటికి వచ్చినట్టు తిట్టడంతో పాటు పదేపదే బదిలీ చేస్తూ వేధిస్తున్నాడన్నారు. అసలే ఉద్యోగుల కొరతతో తీవ్రంగా సతమతమవుతున్న ఈ కార్యాలయం నుంచి ఉద్దేశపూర్వకంగా రెగ్యులర్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని వేరే కార్యాలయానికి డిప్యుటేషన్పై పంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. వేధింపులతో ఆగకుండా ఇప్పుడు భౌతిక దాడికి దిగడంతో ఉద్యోగులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడి నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎల్.శ్రీకాంత్, ఉపాఽధ్యక్షుడు శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.