రిజిస్ట్రార్తో చర్చలు విఫలం
ABN , First Publish Date - 2021-12-05T05:41:42+05:30 IST
రిజిస్ట్రార్తో చర్చలు విఫలం
కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగుల ఆందోళన
విజయవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ.400 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు బదలాయించడాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది చేస్తున్న ఆందోళన శనివారం ఐదో రోజుకు చేరింది. ఉద్యోగులంతా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నాను కొనసాగించారు. యూనివర్సిటీ నిధులను తిరిగి రాబట్టే వరకూ ఆందోళనను కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న జేఏసీ నాయకులను యూనివర్సిటీ రిజిస్ట్రార్ శనివారం చర్చలకు ఆహ్వానించారు. ఈనెల 8వ తేదీన స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. నిధుల విషయం తేలే వరకూ తాము విధులకు హాజరుకాబోమని, ఆందోళనను కొనసాగిస్తామని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. యూనివర్సిటీ నిధులను వెనక్కి ఇచ్చే విషయంలో ఉన్నతాధికారుల నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని జేఏసీ నిర్ణయించింది.