కేంద్రంపై విరుచుకుపడ్డ తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-02-12T17:35:19+05:30 IST
కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సింది కొండంత ఇచ్చింది గోరంత ఎందుకంత అన్యాయమని మండిపడ్డారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయం అని చెప్పి పక్కన పెట్టిందన్నారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.24,350కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1050కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని వివిధ అంశాల కింద ఐదు లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎంగిలి మెతుకులు విధించినట్లు కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఊసేలేదని తెలిపారు. పోలవరం కేంద్రీయ సంస్థల నిర్మాణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్పై అకారణంగా కక్ష కట్టిందని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తులసిరెడ్డి తెలిపారు.