వైసీపీ అక్రమాలు చూసి అందరూ సిగ్గుపడాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-11-15T20:27:07+05:30 IST
ఒక చిన్న ఎలక్షన్లో ఈ స్థాయి అక్రమాలు ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు.
అమరావతి: కుప్పం ఎన్నికల్లో అధికారపార్టీ అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరి, పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అక్రమాలు చూసి అందరూ సిగ్గుపడాలన్నారు. కుప్పంలో పరిస్థితులు, నిన్నటి నుంచి జరిగిన పరిణామాలపై వీడియోలు ప్రదర్శించారు. బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ మనుషులను టీడీపీ కార్యకర్తలు నిలదీయడం.. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన యువకుల సంచారాన్ని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడం.. కుప్పంలో తిరుగుతున్న ఇతర ప్రాంతాల వాహనాల ఫోటోలను కూడా చంద్రబాబు ప్రదర్శించారు.
ఒక చిన్న ఎలక్షన్లో ఈ స్థాయి అక్రమాలు ఎప్పుడు చూడలేదని, 10 రూపాయల కోసం ఆశపడి దొంగ ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని గుర్తించి చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్లో దొంగ ఓటర్లను పెట్టారన్నారు. సోమవారం ఉదయం టీడీపీ ఏజెంట్లను అరెస్ట్ చేశారని, ఎన్నికల రోజు ఎజెంట్లను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా దొంగ ఓట్ల కోసం మనుషులను పిలిచారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.