ముగిసిన భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-12-30T06:33:32+05:30 IST

ముగిసిన భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు

ముగిసిన భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు
పూర్ణాహుతి నిర్వహిస్తున్న పండితులు

ఇంకా తగ్గని భక్తుల రద్దీ

నేడు కూడా ఏర్పాట్ల కొనసాగింపు

విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఐదు రోజుల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా భవానీ భక్తులు ఇంద్రకీలాద్రి వచ్చి దీక్ష విరమించారు. కాగా, దేవస్థానం వైదిక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు చండీ యాగశాలలో వేద పండితులు, అర్చకులు మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. ఈవో డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చివరి రోజు భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతో అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనానికి అనుమతించారు. రాత్రి 10.30 గంటల వరకు భవానీలు అమ్మవారిని దర్శించుకుని, ఇరుముడులు సమర్పించి, మాల విరమణ చేశారు. నేతి కొబ్బరికాయలను హోమగుండాల్లో వేసి దీక్షను పరిసమాప్తం చేసుకున్నారు. కాగా, దూరప్రాంతాల నుంచి భవానీ భక్తులు ఇంకా తరలివస్తూనే ఉన్నారు. దీంతో గురువారం కూడా ఏర్పాట్లను కొనసాగించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దీక్ష విరమణకు వచ్చిన భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించామన్నారు. అడిగినన్ని లడ్డూ ప్రసాదాలు, ప్యాకెట్లలో ఉచిత అన్నప్రసాదాలను అందజేశామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 













Updated Date - 2021-12-30T06:33:32+05:30 IST