టీడీపీ కార్యాలయంపై దాడితో అవినాశ్కు సంబంధం లేదు
ABN , First Publish Date - 2021-10-25T06:00:48+05:30 IST
టీడీపీ కార్యాలయంపై దాడితో అవినాశ్కు సంబంధం లేదు

లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోం
వారి ఇళ్ల ముందు ధర్నాకు దిగుతాం
వైసీపీ కో- ఆప్షన్ సభ్యుడు ముసునూరి సుబ్బారావు
గుణదల, అక్టోబరు 24: టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడితో వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ దేవినేని అవినాశ్కు ఎలాంటి సంబంధం లేదని మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ కో-ఆప్షన్ సభ్యుడు ముసునూరి సుబ్బారావు తెలిపారు. గుణదలలోని వైసీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకుడిగా చెప్పుకొంటున్న పట్టాభి ముఖ్యమంత్రిని ఏకవచనంతో తిట్లపురాణంలో సంబోధించడాన్ని సమర్థించడంతోనే చంద్రబాబు దిగజారుడుతనం అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి దిగజారుడు పనులకు టీడీపీ ఒడిగట్టిందన్నారు. ముఖ్యమంత్రిని తిడుతుంటే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని దేవినేని అవినాశ్కు అన్వయించే ప్రయత్నం సమంజసం కాదన్నారు. ఎవరో వైసీపీ అభిమానులు చేసిన దాడికి అవినాశ్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దాడులు చేయించే నైజం అవినాశ్కు లేదని చెప్పారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని లేకుంటే ఎవరైతే అవినాశ్పై ఆరోపణలు చేస్తారో వారి ఇంటిముందు ధర్నాకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా కోర్టులో గెలవలేని వారు ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాశ్పై ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు.