నిమ్రా కొవిడ్ కేర్ సెంటర్ పరిశీలన
ABN , First Publish Date - 2021-05-16T05:16:05+05:30 IST
నిమ్రా కొవిడ్ కేర్ సెంటర్ పరిశీలన
ఆసుపత్రికి వెళ్లిన మంత్రులు, అధికారులు
బాధితులతో మాట్లాడి వివరాల సేకరణ
యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇబ్రహీంపట్నంలోని ‘నిమ్రా ఆసుపత్రిలో నరకమే’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రులు, అధికారులు స్పందించారు. స్థానిక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం నిమ్రా యాజమాన్యం పనితీరుపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కొవిడ్ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు శనివారం రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కలెక్టర్ ఇంతియాజ్, జేసీ శివశంకర్ వెళ్లారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి గురించి, ఆరోగ్యశ్రీలో ఉన్నవారి నుంచీ డబ్బులు వసూలు చేస్తున్న విషయంపై బాధితుల కుటుంబ సభ్యులు మంత్రులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో విచారణ అనంతరం మంత్రులు, అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ను మంత్రులు ఆదేశించారు.