వైఎస్ సునీత ఫిర్యాదు అందింది: ఎస్పీ
ABN , First Publish Date - 2021-08-13T22:00:39+05:30 IST
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు అందిందని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు అందిందని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కుటుంబ రక్షణ కోసం చర్యలు చేపట్టామని, వ్యక్తిగతంగా, పులివెందులలో వారి నివాసం వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సునీత లెటర్లో పేర్కొన్న అన్ని అంశాలపై తక్షణం విచారణ చేపడతామని అన్బురాజన్ చెప్పారు.
తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. శివశంకర్రెడ్డి బర్త్ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు.