అధ్వానంగా.. బాలుపల్లె రోడ్డు !

ABN , First Publish Date - 2021-04-22T04:57:05+05:30 IST

చింతకొమ్మదిన్నె మండలం పాపాసాహెబ్‌పేట పంచాయతీలోని బాలుపల్లె రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయి.

అధ్వానంగా.. బాలుపల్లె రోడ్డు !
దెబ్బతిన్న రోడ్డులోనే వెళుతున్న ఆటో

వర్షం వస్తే రాకపోకలకు ఇబ్బందే

పట్టించుకోని అధికారులు

సీకేదిన్నె, ఏప్రిల్‌ 21: చింతకొమ్మదిన్నె మండలం పాపాసాహెబ్‌పేట పంచాయతీలోని బాలుపల్లె రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయి. వర్షం వచ్చిందంటే రాకపోకలకు ఇబ్బందే. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ రోడ్డుపై తిరగాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఈ మార్గంలో పాపాసాహెబ్‌పేట, సీకెదిన్నె, బాలుపల్లె, పబ్బాపురం, తదితర గ్రామస్థులు నిరంతరం తిరుగుతుంటారు. దాంతో పాటు బాలుపల్లె సమీపంలోని కమ్మేటిపల్లె నారాయణస్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఆదివారం భక్తులు వస్తుంటారు. పైగా ఈ రోడ్డుపై రాళ్లు పైకి కనపడడంతో పలుమార్లు ద్విచక్ర వాహనాలు పంచర్లు కూడా అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి రాజగోపాల్‌ను వివరణ కోరగా బాలుపల్లె, ఆజాద్‌నగర్‌ రోడ్లకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థకు టెండరు ఇచ్చామని, దాదాపు నాలుగున్నర కి.మీ రోడ్డును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. 


రోజూ ఇబ్బందులే 

ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఈ రోడ్డును వేశారు. అప్పటి నుంచి పట్టించుకునే వారు లేరు. ఎప్పుడైనా వర్షాలు పడి గుంతలు ఏర్పడితే ప్యాచింగ్‌లతో సరిపెడుతున్నారే తప్ప నూతనంగా వేసింది లేదు. ఇటీవల వర్షాలకు రోడ్డు దెబ్బతిని నిత్యం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపి రోడ్డు వేయించి ప్రజల ఇబ్బందులను తొలగించాలి.

- విశ్వనాథరెడ్డి, బాలుపల్లె

Updated Date - 2021-04-22T04:57:05+05:30 IST