దారి దారుణం.. ప్రయాణం ధైన్యం
ABN , First Publish Date - 2021-10-25T05:02:35+05:30 IST
అది ఒక మారుమూల గ్రామం. ఇక రహదారి నరకానికి రాదారిగా మారింది.
రాజుపాళెం, అక్టోబరు 24: అది ఒక మారుమూల గ్రామం. ఇక రహదారి నరకానికి రాదారిగా మారింది. పట్టణాలు, మండల కేంద్రాల సమీపంలోనే రోడ్ల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక మారుమూల పల్లెల గురించి చెప్పనలవికాదు. పదేళ్లుగా ఆ గ్రామానికి రోడ్డు సరిగా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారులేరు. ఆ దారి వెంట ప్రయాణం చేయడం మా వల్ల కాదంటూ జనం మొరపెట్టుకుంటున్నారు. ఆ రోడ్డుకు ఇదో రోడ్డ వేస్తాం, అదే రోడ్డు వేస్తా అంటున్నారే తప్ప పూర్తి చేసేనాథుడే లేడని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. ఆ రహదారి రాజుపాళెం మండలంలోని సంబటూరు పంచాయతీ కొట్టాల గ్రామానికి చెందింది. పది సంవత్సరాలుగా రోడ్డు సక్రమంగా లేక ఎండకాలమంతా పంట పొలాల్లో, మిగతా కాలమంతా రాళ్లమీదనే స్థానికులు ప్రయాణం సాగిస్తున్నారు. అయితే గత మూడు నెలల క్రితం రోడ్డు మంజూరైందని, ఎక్స్కవేటర్తో రోడ్డంతా చదును చేసినా రోడ్డు వేయకుండా అలాగే వదలి వేయడంతో రోడ్డుపై వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇక రోడ్డుపై మేము ప్రయాణం చేయలేమని మొరపెట్టుకుంటున్నారు. కనీసం తాత్కాలికంగా ఆ రాళ్లమీద కంకర చిప్స్ వేస్తే గుడ్డికన్నా మెల్లలాగా ప్రయాణం సాగుతుందని,ప్రజలు వేడుకుంటున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పం దించి ఆ రోడ్డుకు మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.