వరి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ABN , First Publish Date - 2021-05-09T04:40:49+05:30 IST
వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుందని వ్యవసాయ సలహా మండలి చైౖర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.

వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి
జమ్మలమడుగు రూరల్, మే 8: వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుందని వ్యవసాయ సలహా మండలి చైౖర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘వరి రైతును వీడని కష్టాలు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన సలివెందుల రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం, సలివెందుల, గొరిగెనూరు, తదితర గ్రామాలలో పర్యటించి వరి రైతులతో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వరి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్ ధర క్వింటా రూ.1200 ఉంటే ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.1888 ఉందన్నారు. ప్రభుత్వం మద్దతు ధర రైతులకు అందిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.