నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2021-08-03T04:45:08+05:30 IST
అందరికీ నాణ్యమైన విద్య అందించడమే నూతన విద్యా విధానం లక్ష్యమని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటకృష్ణారెడ్డి అన్నారు.
పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటకృష్ణారెడ్డి
రాయచోటి, ఆగస్టు 2: అందరికీ నాణ్యమైన విద్య అందించడమే నూతన విద్యా విధానం లక్ష్యమని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యా విధానంపై రాయచోటి డివిజన్ పరిధిలోని 16 మండలాల ఎంఈవోలకు, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు ఉన్న 18 సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడు బోధించడం వలన అనుకున్న ఫలితాలు రావడం లేదన్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం వలన వారికి సబ్జెక్టు వారీగా నాణ్యమైన బోధన చేయవచ్చన్నారు. అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలో కలపడం వల్ల సింగల్ టీచర్ పాఠశాలలు ఇక ఉండవన్నారు. ఈ విధానంలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్య ప్రవేశ పెట్టడం వల్ల బాలికల డ్రాపౌట్స్ తగ్గుతాయన్నారు. సమావేశంలో రాయచోటి ఉప విద్యాశాఖాధికారి రంగారెడ్డి, రిసోర్స్ పర్సన్ మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు రెడ్డెప్పరెడ్డి, డీఈవో కార్యాలయ సిబ్బంది బ్రహ్మానందరెడ్డి, జ్వాలాపతి పాల్గొన్నారు.