కొవిడ్ను కట్టడి చేస్తూ సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2021-05-12T05:07:44+05:30 IST
కొవిడ్ నియంత్రణ నిరంతర ప్రక్రియ అని, కొవిడ్తో పోరాటం చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి
కడప (కలెక్టరేట్), మే 11 : కొవిడ్ నియంత్రణ నిరంతర ప్రక్రియ అని, కొవిడ్తో పోరాటం చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్ నియంత్రణ, ఎస్ఆర్ఈజీఎస్, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్లు, పేదలందరికీ ఇళ్లు, స్పందన తదితర అంశాలపై సీఎం జగన్ మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ జాయింట్ కలెక్టర్లు గౌతమి, ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మలోల తధితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీసీ అనంతరం కలెక్టర్ అదికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కొవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు చేపడుతూనే ప్రభుత్వ పథకాలను విధిగా కొనసాగించాలన్నారు. కొవిడ్ విధులకు కేటాయించిన నోడల్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మందులు, పారిశుధ్యం కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సచివాలయాల ప్రాంగణాల్లో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న సచివాలయాల భవనాలు, రైతు భరోసా, హెల్త్ క్లీనిక్లు, నాడు-నేడు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల కూలీలకు కొవిడ్ నిబంధనలు, స్వీయ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుందని, అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంటల నమోదుతోపాటు అన్ని రకాల విత్తనాలు, మందులు, ఎరువుల కొరత లేకుండా సిద్ధంగా ఉండేలా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డ్వామా, ఐసీడీఎ్స, పీడీలు యధుభూషణ్రెడ్డి, పద్మజ. డీఎంహెచ్వో డాక్టర్ అనిల్కుమార్, ఎస్ఎస్ఏ పీవో ప్రభాకర్రెడ్డి, పీఆర్ ఎస్ఈ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.