నిలిచిపోయిన గండికోట రోప్వే
ABN , First Publish Date - 2021-09-03T07:18:28+05:30 IST
నిలిచిపోయిన గండికోట రోప్వే

పిల్లర్లు మాత్రమే ఏర్పాటు
మూలనపడ్డ వైరు
జమ్మలమడుగు రూరల్, సెప్టెంబరు 2: పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధి పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని పలువురు పర్యాటకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫోర్ లైన్స రోడ్డు, తదితర అభివృద్ధి పనులు జరిగాయి. 2018లో సుమారు రూ.7.50 కోట్లతో గండికోట లోయకు పైభాగాన అగస్త్యేశ్వరకోనకు వెళ్లేందుకు రోప్వే నిర్మాణానికి అప్పటి మంత్రి దేవగుడి ఆదినారాయణరెడ్డి తదితరులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కాగా రోప్వే పనులకు సంబంధించి పిల్లర్స్ వరకు పనులు జరిగి తర్వాత నిలిచిపోయాయి. అక్కడ కాంట్రాక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ బిల్లులు రావన్న భయంతో పనులు చేయకుండా నిలిపివేసినట్లు పలువురు చెబుతున్నారు. గండికోట లోయ సమీపాన రోప్వేకు సంబంధించిన ఇనుప తాడు మూలనపడింది. గండికోట ఉత్సవాలు కూడా ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఉత్సవాలు కూడా జరగలేదు. ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి గండికోట అభివృద్ధిపై దృష్టి సారించి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులతో పాటు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
